ట్రంప్ నిర్ణయం భారత ఐటీ ఉద్యోగులకే మేలు

9 Feb, 2017 15:38 IST|Sakshi
ట్రంప్ నిర్ణయం భారత ఐటీ ఉద్యోగులకే మేలు
న్యూఢిల్లీ: హెచ్‌ 1బీ వీసాలను పరిమితం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అటు అమెరికా ఐటీ కంపెనీలపై ఇటు భారత ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? హెచ్‌ 1బీ వీసాదారుల కనీస వేతనాన్ని ఏడాదికి 60 వేల డాలర్ల నుంచి 1,30,000 డాలర్లకు పెంచాలంటూ ట్రంప్‌ ప్రతిపాదన మేరకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లు పాసవుతుందా, లేదా? పాసైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అది ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది? అమెరికా ఉద్యోగులకా, భారతీయ ఉద్యోగులకా? అనే ప్రశ్నలు తీవ్రస్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి. 
 
అమెరికాలోని ఐటీ కంపెనీలు ప్రస్తుతం హెచ్‌ 1బీ వీసాలపై వచ్చే భారతీయులకు ఏడాదికి 70 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. అదే అమెరికన్లకు సరాసరి సగటున ఒకరికి లక్ష డాలర్లను చెల్లిస్తున్నాయి. అమెరికన్లకన్నా విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల తక్కువ జీతానికి వస్తున్నందున అధిక లాభాల కోసం ఐటీ కంపెనీలు, ముఖ్యంగా భారతీయ కంపెనీలు భారతీయ ఉద్యోగులవైపు మొగ్గు చూపుతున్నాయి. హెచ్‌ 1బీ వీసాల కోసం పోటీ పడుతున్నాయి. ఫలితంగా అమెరికన్లకు అవకాశాలు మగ్యమవుతున్నాయి. అమెరికన్లకు వారి ఉద్యోగావకాశాలను కల్పించడమే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ వీసాలపై కన్నేశారు.
 
అధిక లాభాలకు ఆశపడే ఐటీ కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించి అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటాయా? అంతమంది నిపుణులు అక్కడ దొరుకుతారా? ఏడాదికి 1,30,000 డాలర్లు చెల్లించి భారతీయులను తీసుకుంటాయా ? అన్న ప్రశ్నలకు దొరికే సమాధానాలపైనే ట్రంప్‌ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్న అంశం ఆధారపడి ఉంది. భారతీయ ఆర్ధిక వ్యవస్థకు నేడు ఐటీ రంగం వెన్నుముకగా మారిన విషయం తెల్సిందే. మొత్తం సర్వీసుల ఎగుమతుల రంగంలో 45 శాతం వాటా కలిగిన ఈ ఐటీ కంపెనీలు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతాన్ని ఆక్రమించాయి. 37 లక్షల మంది ఉద్యోగులతో ప్రైవేటు రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా ఇదే. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీ కంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. ఇంతటి ప్రాముఖ్యత కల రంగం మీద ట్రంప్‌ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నదే ప్రస్తుత చర్చ.
 
అమెరికన్లు వారాంతంలో పనిచేయరని, వారు ఎక్కువగా సెలవులు పెడతారన్న ఆరోపణలు కంపెనీల నుంచి వినిపిస్తుంటాయి. అమెరికన్లకు గంటకు ఓటీ కింద వంద డాలర్లను చెల్లించాల్సి వస్తుందని, అదే భారతీయులకైతే గంటకు 60 డాలర్ల చెల్లిస్తే సరిపోతుందని, 40 డాలర్లు మిగుల్చుకోవచ్చన్నది ఐటీ కంపెనీల ఆశనే ప్రత్యారోపణలు కూడా ఉన్నాయి. హెచ్‌ 1బీ వీసాలను పరిమితం చేసేందుకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ బుట్ట దాఖలవుతాయని భారతీయ ఐటీ కంపెనీలు, నాస్కామ్‌ భావిస్తున్నాయి. ఈ వీసాల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో వాదించి అమెరికా కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదనలు వీగిపోయేలా చేస్తామని నాస్కామ్‌ తెలిపింది. 
 
ఇప్పటికే అమెరికా కంపెనీలు తమకు వచ్చే రెవెన్యూలో సగం శాతాన్ని ఐటీ కంపెనీలకే చెల్లిస్తున్నాయని, వీసాల కింద వేతనాల పరిమితిని పెంచడం వల్ల ఆ భారం కూడా అమెరికా కంపెనీలపైనే పడుతుందని, అవి ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాలకన్నా మరో పది శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోందని నాస్కామ్‌ వాదిస్తోంది. స్థానికంగా పెద్ద సంఖ్యలో నైపుణ్యంగల ఉద్యోగులు అమెరికాలో దొరకరని చెబుతోంది. నాస్కామ్‌ వాదనే నిజమైతే భారతీయ ఐటీ ఉద్యోగులకే వేతనాలు పెరిగి లాభం చేకూరుతుంది. భారత్‌ ఐటీ ఎగుమతుల్లో 60 శాతం వాటా ఒక్క అమెరికా నుంచే వస్తుండగా, బ్రిటన్‌ నుంచి కేవలం 17 శాతం మాత్రమే వస్తోంది. 
 
మరిన్ని వార్తలు