కోల్‌కతాలో రెండో టీయూ–142 మ్యూజియం

1 Jan, 2018 01:58 IST|Sakshi

     ఇన్‌చార్జిగా రాష్ట్రానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ రమణకుమార్‌

     ఇటీవలే విశాఖలో ప్రారంభమైన తొలి మ్యూజియం

సాక్షి, విశాఖపట్నం: భారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ–142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్‌ నేవీలోకి వచ్చి 29ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్‌ ఎయిర్‌ బేస్‌ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్‌ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్‌ కొనుగోలు చేసింది.

నేవీ సేవల నుంచి నిష్క్రమించిన టీయూ–142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని ఈ డిసెంబర్‌ ఏడో తేదీన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభిం చారు. విశాఖ ఉత్సవ్‌ తొలిరోజైన డిసెంబర్‌ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియాన్ని విజయవం తంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్‌చార్జిగా పంపనున్నారు.

మరిన్ని వార్తలు