కూనవరం: మండలంలోని కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో ప్రసూతి వైద్య నిపుణుడు, దంత వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన ఈ సీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూనవరం సీహెచ్సీకి రెగ్యులర్ జనరల్ సర్జన్, చర్మవ్యాధి నిపుణుడితోపాటు ముగ్గురు రెగ్యలర్ వైద్యాధికారులను నియమించామన్నారు. మిగతా వైద్యనిపుణుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఇక్కడ జనరల్ సర్జరీలు ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ టీవీ శేషిరెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ మహేష్ బాబును ఆయన ఆదేశించారు. ఎన్ఆర్సీ కేంద్రంలో పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. సిబ్బంది నివాసం ఉండేందుకు అవసరమైన పాత ప్రైవేట్ క్వార్టర్లను ఆయన పరిశీలించారు. వైద్యులు తేజ, సంతోష్ ,అర్బాజ్ ఖాన్, హెడ్ నర్స్ బి. బొజ్జి , డీసీహెచ్ ఎస్ పాడేరు సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.