అనంతపురం అర్బన్: పెన్సనర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఎస్టీఓకు పెన్సనర్ల సంఘం నాయకులు విన్నవించారు. జిల్లా ఖజానా అధికారి ఆదేశాల మేరకు అనంతపురం హెడ్ క్వార్టర్స్ సబ్ ట్రెజరీ అధికారులు, పెన్సనర్ల సంఘం నాయకుల సమన్వయం సమావేశాన్ని గురువారం స్థానిక బుడ్డప్పనగర్లోని ఉప ఖజానా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఓలు శ్రీ లక్ష్మి, అనంతయ్యతో పెన్సనర్ల సమస్యలపై సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెద్దన్నగౌడ్, జయరామప్ప చర్చించారు. పెన్సనర్ల సమస్యల పరిష్కారానికి ఈ తరహా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పెన్సనర్లకు సంబంధించిన ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఎస్టీఓలు, ఖజానా శాఖ జిల్లా అధికారి చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరిధిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సర్వీసు పెన్షనర్ మరణించిన తరువాత ఫ్యామిలీ పెన్షన్ జారీలో జాప్యానికి తావ్విరాదని కోరారు. నాయకులు లేవనెత్తిన అంశాలపై ఎస్టీఓలు మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సంఘం నాయకులు ఖలందర్, రామకృష్ణ, ప్రభాకర్, వరదరాజులు, అనంతయ్య, నాగభూషణం, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీఓకు పెన్షనర్ల సంఘం
నాయకుల వినతి