Waqf Lands వక్ఫ్‌ భూముల మ్యాపింగ్‌లో ఏపీ ఆదర్శం

24 Sep, 2021 04:12 IST|Sakshi
మాట్లాడుతున్న సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు

అభినందించిన సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కృషి అద్భుతమని సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు జనాబ్‌ నౌషాద్, జనాబ్‌ హనీఫ్‌అలీ, ఎస్‌. మున్వారీబేగం, దరక్షన్‌ ఆంద్రాబీ ప్రశంసించారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 559.16 ఎకరాల వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని పరిరక్షించడంపై వారు ప్రభుత్వాన్ని అభినందించారు. విజయవాడలోని ఏపీ స్టేట్‌ వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రటరీ గంధం చంద్రుడు ఇతర ఉన్నతాధికారులతో వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గురువారం సాయంత్రం కౌన్సిల్‌ సభ్యులు సమీక్షించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

వారు మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తులను 50 శాతానికి పైగా మ్యాపింగ్‌ చేసి దక్షిణ భారతదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పలు పథకాల కింద రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని కౌన్సిల్‌ సభ్యులు చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఏపీ వక్ఫ్‌బోర్డు కమిటీని, వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ త్వరగా ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు.  ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో ఎస్‌.అలీమ్‌బాషా, ఏపీ వక్ఫ్‌బోర్డు డిప్యూటీ సెక్రటరీ షేక్‌ అహ్మద్, డిప్యూటీ ఇంజినీర్‌ అబ్దుల్‌ఖాదిర్‌ పాల్గొన్నారు.
చదవండి: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

మరిన్ని వార్తలు