పెడనలో అల్లర్లకు పవన్‌ కుట్ర | Sakshi
Sakshi News home page

పెడనలో అల్లర్లకు పవన్‌ కుట్ర

Published Wed, Oct 4 2023 5:02 AM

Jogi Ramesh challenges Janasena Leader Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెడనలో జరగబోయే వారాహి యాత్రపై దాడిచేసే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన పిచ్చి­వ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ మండిపడ్డారు. దాడికి యత్నిస్తున్నారంటూ పిచ్చి ఆరోపణలు చేయటంకాదు.. ఆధారాలుంటే నిరూపించే దమ్ముందా? అంటూ ఆయన సవాల్‌ విసిరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పెడన ప్రజలు శాంతి కాముకులని.. ఏనాడూ చిన్న హింసకు కూడా పాల్పడలేదని చెప్పారు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవ­డానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? అని జోగి రమేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు నీ వారాహి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటని మండిప­డ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

అవనిగడ్డ సభ ఫ్లాప్‌తో పవన్‌లో దిగులు పట్టుకుంది. పెడనలో కూడా బుధవారం జరిగే సభకు ఇలాగే జనం రారని భయపడుతున్నారు. అంగళ్లు మాది­రిగా అక్కడ గొడవల్ని సృష్టించే కుట్రకు తెరతీశారు. అందుకే పవన్‌ ఇలా మాట్లాడుతున్నారు. జైలులో ఉన్న దత్తతండ్రి మాస్టర్‌స్కెచ్‌ ఇది. ఆదిలోనే టీడీపీ, జనసేన పొత్తు వికటించింది. చంద్రబాబుతో జతకు పవన్‌ ఒక్కడే తహతహలాడున్నారు. అధినేత నిర్ణయాన్ని పవన్‌ అభిమానులు, జనసేన పార్టీ కేడర్‌ ఒప్పుకోలేకపోతోంది.

ఇక జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. పవన్‌ చాప, దిండు సర్దుకుని హైదరాబాద్‌కు వెళ్లడమే తరువాయి. అవనిగడ్డలో మూడుగంట­లసేపు కష్టపడి మీటింగ్‌ కొనసాగిస్తే కేవలం 300 మంది మాత్రమే సభాస్థలిలో ఉన్నారు. అది కూడా టీడీపీ, జనసేన జతకట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి సభలో. ఇదీ వాళ్ల పరిస్థితి. పార్టీ పరువు పోతుందని జనసేన, టీడీపీ నేతలు తమ కేడర్‌కు ఫోన్లు చేస్తేనే అంతమంది వచ్చారు. జనసేన అలా చతికిలపడడానికి కారణం టీడీపీతో జత కట్టడమే. అధినేత తీరు వారికి నచ్చడంలేదని దీంతో తేలిపోయింది. 

పవన్‌కళ్యాణ్‌ను నమ్మొద్దు..
గతకాలపు అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా టీడీపీతో జతకట్టి చంద్ర­బాబును మరోమారు గద్దెనెక్కించేందుకు జనసేన కార్యకర్తలెవరూ సిద్ధంగా లేరు. ఇదే విషయంపై బాహాటంగానే ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆ పార్టీ కార్యకర్తలకు, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు చెప్పేదేమంటే, ఇప్పటికైనా ఆయన మాటల్లోని మర్మాన్ని అర్థంచేసుకోవాలి. పవన్‌ను నమ్మితే జనసైనికులు నట్టేట మునిగినట్లే. 

Advertisement
Advertisement