ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం

10 Sep, 2021 02:23 IST|Sakshi
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి

వారు పావలా వడ్డీ చెల్లిస్తే, మిగతాది ప్రభుత్వం భరిస్తుంది 

216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి     

లబ్ధిదారులంతా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే 

కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి 

మిగిలిన 4,240 ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమించాలి.. బ్యాంకర్లు ఆర్బీకేలను తమవిగా భావించాలి 

వైఎస్సార్‌ చేయూత మహిళలకు అండగా నిలవాలి 

కోవిడ్‌తో 2020–21లో 7.25 శాతం తగ్గిన దేశ జీడీపీ 

అదే ఏపీలో 2.58 శాతానికే పరిమితం 

ఇందులో కీలక పాత్ర పోషించినందుకు మీకు అభినందనలు 

ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో ఆర్బీకేల్లో కియోస్క్‌లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్‌ చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్‌ రంగంతో అనుసంధానం కావాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి.  
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు 35 వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని, వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి (3 శాతం) రుణాలు ఇస్తే, మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్‌ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామని తెలిపారు. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌  
 
కౌలు రైతులకు రుణాలు అందాలి  
► కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు 4,91,330 క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్స్‌ (సీసీఆర్‌సీలను) ఇచ్చాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్‌కు అనుసంధానం చేశాం. 
► ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులు. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్‌ ద్వారా నిర్ధారిస్తున్నాం. వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్‌ ద్వారా ధృవీకరిస్తున్నాం. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి.  
► వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలి.  
 
విత్తనం నుంచి విక్రయం వరకు.. 

► రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌ చేసి మరీ ఇ– క్రాపింగ్‌ చేస్తున్నాం.  
► పంటను సాగు చేస్తున్న రైతుకు డిజిటల్‌ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది.  
► ఇ– క్రాపింగ్‌ అనేది సీసీఆర్‌సీ కార్డులకే కాదు, వడ్డీ లేని పంట రుణాలకు, ఇన్‌పుట్‌ సబ్సిడీకి, ఇన్సూరెన్స్‌కు.. ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. 
  
అన్ని ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు 
► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలకు గాను బ్యాంకర్లు ఇప్పటికే 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్‌ చేసి అక్కడ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయం. మిగిలిన 4240 చోట్ల కూడా వీలైనంత త్వరగా వారిని నియమించాలని కోరుతున్నాను. 
► ప్రతి ఆర్బీకేలో ఒక బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండాలి. ఇతని సేవలను ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ– క్రాపింగ్‌ ప్రక్రియలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్‌ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది.  
► బ్యాంకింగ్‌ విషయంలో వైఎస్సార్‌ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేశామని చెబుతున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్‌ అంటే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్‌ కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్‌/ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించడం అని చెప్పారు. ఇది మంచిదే. కానీ సేవల పరంగా ఇంకా ముందుకెళ్లాలి.  
► అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్‌లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. 
 
చిరు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలి 
► జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. 
► దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలి. 
► ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తోంది. వీరికి తగిన తోడ్పాటు అందించాలని కోరుతున్నాను.    
► ఈ సమావేశంలో సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.  వర్చువల్‌గా ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్‌ కుమార్‌ గార్గ్‌లు పాల్గొన్నారు.  
 
మహిళా సాధికారతకు సహకరించాలి 
► వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున  మొత్తంగా రూ.75 వేలు అందుతాయి. 
► వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ మొత్తం అందుతుంది. తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారిని రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, హిందుస్థాన్‌ యూనిలీవర్, అమూల్‌ లాంటి కంపెనీలతో టై అప్‌ చేశాం.  
► ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను.  
► మహిళ చేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీ చేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లను కూడా అందించాం. ఫేజ్‌ –2లో భాగంగా కిరాణా దుకాణాల కోసం 22 వేల మంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం.  

కష్టకాలంలో మీ సేవలు భేష్‌ 
► కోవిడ్‌ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధి మార్గాలు దెబ్బ తిన్నాయి. కోవిడ్‌ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది.  
► గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది.  
► దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు.  
► 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో క్షీణత 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను.  
► గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్‌ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. 
 
ఏపీ కార్యక్రమాల పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసక్తి 
ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో చేయూత మహిళలకు స్వయం ఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు. పెద్ద సంస్థలతో కలిసి రిటైల్‌ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరు పట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. 
– వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ 
 
డిజిటలైజేషన్‌తో సులువుగా సేవలు 
వైఎస్సార్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సులువుగా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. 
– సుధీర్‌కుమార్‌ జన్నావర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, నాబార్డ్‌ 
 
ఆర్థిక వ్యవస్థకు ఊతం  
ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. వీటివల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్‌ ఏజ్‌లో ముందడుగుగా భావిస్తున్నాం.  
– దినేష్‌కుమార్‌ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబయి 

మరిన్ని వార్తలు