సైనిక పాఠశాల వార్షికోత్సవ వేడుక

19 Jan, 2022 04:55 IST|Sakshi
విద్యార్థుల మల్లకంబ విన్యాసాలు

ఆకట్టుకున్న విద్యార్థుల సాహస విన్యాసాలు

విజయనగరం రూరల్‌:  విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల 60వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన వార్షికోత్సవాన్ని ప్రిన్సిపాల్, కల్నల్‌ ఏఎం కులకర్ణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన వేడుకల్లో పూర్వ విద్యార్థులు, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ కె.ఆర్‌.రావు, సురేంద్రనాథ్, వైవీకే మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ కులకర్ణి మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సుమారు 690 మంది త్రివిధ దళాలలో ప్రవేశించి దేశ సేవలో తరిస్తున్నారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన గుర్రపు స్వారీ, మల్లకంబ, హై హార్స్‌ వంటి సాహస విన్యాసాలు చూపరులను అలరించాయి. 

ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ
కోరుకొండ సైనిక పాఠశాల 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్‌పై భారతీయ తపాలా శాఖ ముద్రించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను ప్రిన్సిపాల్, కల్నల్‌ ఏఎం కులకర్ణి, వైస్‌ ప్రిన్సిపాల్, వింగ్‌ కమాండర్‌ ఎస్‌.కేశవన్, పరిపాలన అధికారి, లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ అభిలాష్‌ బాలచంద్రన్‌ మంగళవారం ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం పాఠశాలకు అంబులెన్స్‌ వాహనం, 4 కిలోల వెండి జ్ఞాపిక బహూకరించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు