బస్సు ప్రమాదం: సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

15 Dec, 2021 15:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

మంత్రి ఆళ్లనాని తీవ్ర దిగ్భ్రాంతి
జిల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి
బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని అదేశించారు. ఈ ప్రమాదంలో 20మందికి పైగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

చదవండి: (జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి)

మరిన్ని వార్తలు