నగదు జమ చేసిన చేనేత, జౌళి శాఖ
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి సకాలంలో దరఖాస్తు చేసుకోలేక మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారులకు బుధవారం చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి రూ.24 వేల చొప్పున సాయం అందజేశారు. హైదరాబాద్లోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్గా చేనేత కుటుంబాలతో మాట్లాడిన మంత్రి.. కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా 8,903 కుటుంబాలకు రూ.21.36 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.
మగ్గాలను ఆధునీకరించుకుని మరింత నైపుణ్యవంతమైన పనితీరుతో పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఉదార గుణం వల్లే ఇవాళ మరింత మంది లబ్ధిదారులకు వైఎస్సార్ నేతన్న నేస్తం అందుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సాయమందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటికే సుమారు 82 వేల మందికి ప్రభుత్వం సాయం అందించిందని తెలిపారు.