5G:ఎయిర్టెల్‌, జియో కీలక నిర్ణయం: చైనాకు షాక్‌!

28 Jul, 2022 14:38 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన  5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది.  మరోవైపు  దేశీయ దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్‌, జియో చైనా కంపెనీలతో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్‌ చేసుకోవడంతో చైనాకు ఇక తలుపులు మూత పడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.

అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే.  వేలం ప్రక్రియ మూడో రోజు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌  వెల్లడించారు. 

బుధవారం బిడ్డింగ్ ముగిసే సమయానికి జియో రూ. 82,500 కోట్లకు  దాదాపు 46,000 కోట్లతో ఎయిర్‌టెల్, రూ. 19,000 కోట్లతో వొడాఫోన్ ఐడియా బిడ్డింగ్‌ చేయగా, కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్‌వర్క్స్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం దాదాపు రూ.900-1,000 కోట్లకు బిడ్ చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేలా 700 GHz బ్రాండ్‌ను కొనుగోలు చేయగల ఏకైక టెలికాం జియో మాత్రమేనని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు  5జీ  సేవలకు సంబంధించి జియో ఎయిర్టెల్‌ భాగస్వామ్యాలు  విశేషంగా నిలిచాయి.

టెలికాం కంపెనీల 5జీ పార్టనర్‌షిప్స్‌
జియో, ఎయిర్‌టెల్ ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్‌లకు కాంట్రాక్టుల భాగస్వామ్యాల్ని కుదుర్చుకున్నాయి. తద్వారా 5జీ సేవల విషయంలో  చైనా కంపెనీలు,హువావే, జెడ్‌టీఈలకు మన దేశంలో అధికారికంగా  తలుపులు మూసేసినట్టైంది. కాగా 5జీసేవలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఆగస్టు 14 తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను  ఆయా కంపెనీలకు కేటాయించనుంది.

మరిన్ని వార్తలు