టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా

10 Sep, 2022 15:09 IST|Sakshi

ప్రైవేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌లో భాగమైన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా.. ప్రభుత్వ అధీనంలోని ప్రాపర్టీల నుంచి ఖాళీ చేయాలని నిర్ణయించుకుంది. విస్తార సహా గ్రూప్‌లోని ఇతర ఎయిర్‌లైన్స్‌తో పాటు వచ్చే ఏడాది మార్చి నుంచి ఒకే దగ్గర నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను టాటా గ్రూప్‌ ఈ ఏడాది జనవరిలో రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎయిరిండియా .. ప్రభుత్వ భవంతుల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది.

ఢిల్లీ, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్‌ కాలనీల నుంచి ఖాళీ చేయాలంటూ తమ సిబ్బందికి ఎయిరిండియా మే నెలలోనే సూచించింది. తాజాగా ఈ నెల నుంచి ఖాళీ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బంది తాత్కాలికంగా గురుగ్రామ్‌లోని కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న వాటికా కాంప్లెక్స్‌కి వచ్చే ఏడాది తొలినాళ్లలో మారతారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు టాటా గ్రూప్‌నకు విస్తార విమానయాన సంస్థలో 51 శాతం (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో జేవీ), ఎయిర్‌ఏషియా ఇండియాలో 83.67 శాతం వాటాలు ఉన్నాయి.

చదవండి: గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!

మరిన్ని వార్తలు