Airbus jobs: గుడ్‌ న్యూస్‌.. ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు

8 Sep, 2023 18:07 IST|Sakshi

గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్‌బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్‌ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే కాకుండా టాలెంట్‌ హబ్‌గా చూస్తున్నామన్నారు.

కొత్త ఇంజనీరింగ్‌ కోర్సు
ఎయిర్‌బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు.

(Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్‌ బంపరాఫర్‌.. )

ఎయిర్‌బస్‌ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు.   భారత్‌ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను  2026 సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు