భారత్‌ ఫైనాన్షియల్‌ ఎండీ, ఈడీల రాజీనామా

30 Nov, 2021 06:43 IST|Sakshi

పోటీ సంస్థ స్పందన స్ఫూర్తిలో చేరిక!

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో భాగమైన భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (బీఎఫ్‌ఐఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), సీఈవో శలభ్‌ సక్సేనా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.. సీఎఫ్‌వో ఆశీష్‌ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్‌ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్‌ఐఎల్‌ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్‌ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్‌ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది.

సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్‌–సీఎఫ్‌వోగా నియమించినట్లు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఎల్‌ నవంబర్‌ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్‌ 23న బీఎఫ్‌ఐఎల్‌ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్‌ఐఎల్‌ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్‌ఐఎల్‌ వివరణ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు