-
బీఎస్ఎన్ఎల్ రెండేళ్లలో లాభాల్లోకి : పార్లమెంటరీ ప్యానెల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలను ఆర్జించొచ్చని.. ఇది కూడా పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా రూపొందించిన విధానాలు, ప్రణాళికల అమలు, మిగులు భూముల విక్రయంపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నిర్వహణపరమైన లాభాల్లోకి మాత్రమే అడుగు పెట్టినట్టు గుర్తు చేసింది. అంటే పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు లాభాల్లో ఉండడం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్లో ఆమోదం తెలిపిన విషయం గమనార్హం. ఇందులో భాగంగా అధిక శాతం మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ పథకం కింద తగ్గించుకుని నిర్వహణ వ్యయాలను ఆదా చేసుకోవడం ఒకటి. ఇది అమలైంది. అలాగే, ఈ సంస్థలకు ఉన్న భూముల విక్రయాలు, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ప్యాకేజీలో భాగమే.