కేంద్ర బడ్జెట్ 2022: మధ్యతరగతి కోసం ఆ రెండు పన్ను ప్రయోజనాలు?

19 Jan, 2022 21:26 IST|Sakshi

బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్‌ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి.  

రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో..  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్‌’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది.  2022-23 బడ్జెట్‌లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా..  రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇందులో మొదటిది.. 

స్టాండర్డ్ డిడక్షన్..  ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని..  తిరిగి 2018-19 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు.  మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.  గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్‌లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు.

పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు.  ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్లిక్‌ చేయండి: ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

మరిన్ని వార్తలు