Hyderabad: దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద భవనం.. స్కైస్క్రాపర్లకు పెరిగిన డిమాండ్‌

29 Nov, 2021 11:05 IST|Sakshi

హైదరాబాద్‌ నగరంలో ఆకాశ హార్మ్యాలకి డిమాండ్‌ పెరిగింది. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద స్కైస్క్రాపర్‌ భాగ్యనగరంలో రానుంది. అదే వరుసలో మరికొన్ని బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేందుకు డెవలపర్లు పోటీ పడుతున్నారు. 

రెసిడెన్షియల్‌
కోవిడ్‌ సంక్షోభం ముగిసిన తర్వాత భాగ్యనగరంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ వివరాల ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు స్కై స్క్రాపర్ల నిర్మాణం కోసం ఏకంగా 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్స్‌స్టిట్యూషన్‌ పర్పస్‌ కోసం వచ్చిన దరఖాస్తులు 4 కాగా కమర్షియల్‌ పర్పస్‌ కోసం వచ్చిన దరఖాస్తులు 23గా ఉన్నాయి. మిగిలనవీ అన్నీ రెసిడెన్షియల్‌ కోసమే అని గ్రేటర్‌ అధికారులు అంటున్నారు.

25 దాటితే
సాధారణంగా 25 అంతస్థుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్కై స్క్రాపర్‌గా పేర్కొంటారు. అయితే వీటి నిర్మాణం చేపట్టాలంటే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాలి. గతంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నగరం మధ్యలో ఉండటంతో ఇక్కడ భారీ భవంతున నిర్మాణం పెద్దగా జరగలేదు. శంషాబాద్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాతే తొలి దశ ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరిగింది. వీటికి బిజినెస్‌ బాగానే జరగడంతో ఇప్పుడు దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద భవన నిర్మాణ పనులు నగరంలో మొదలయ్యాయి.

57 అంతస్థులతో
ఎస్‌ఏఎస్‌ క్రౌన్‌ సంస్థ కోకాపేటలో 57 అంతస్థులతో దక్షిణాదిన అతి పెద్ద స్కైస్ర్కాపర్‌ నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు సౌతిండియాలో అతి పెద్ద బహుల అంతస్థుల భవనం బెంగళూరులో ఉంది. ఆ భవనంలో 50 అంతస్థులు ఉన్నాయి. కాగా ఎస్‌ఏఎస్‌ క్రౌన్‌ నిర్మించే స్కై స్క్రాపర్‌ దాన్ని అధిగమించనుంది.

మరికొన్ని
- క్యాండియర్‌ క్రీసెంట్‌ సంస్థ లింగంపల్లిలో 53 అంతస్థుల స్కై స్క్రాపర్‌ పనులు చేపడుతోంది
- మైహోం లైఫ్‌ హబ్‌ సంస్థ కోకాపేటలో  50 అంతస్థుల బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తోంది
- నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో హెచ్‌ఆర్‌ఐ క్యాపిటల్‌ సంస్థ 47 అంతస్థుల భవనం నిర్మిస్తోంది
- నానక్‌రామ్‌గూడాలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో సెన్సేషన్‌ హైదరాబాద్‌ వన్‌ 47 అంతస్థుల భవనం నిర్మిణం చేపట్టనుంది

చదవండి: చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక

మరిన్ని వార్తలు