Reliance: రిలయన్స్‌ క్యాపిటల్‌ దివాలా పరిష్కారంపై భిన్నాభిప్రాయాలు!

11 Apr, 2022 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌ (ఆర్‌క్యాప్‌) దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి ఇటు అడ్మినిస్ట్రేటరు, అటు రుణదాతల కమిటీ (సీవోసీ) మధ్య  భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనితో తదుపరి తీసుకోవాల్సిన చర్యల విషయంలో జాప్యం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

వివరాల్లోకి వెడితే రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌క్యాప్, దాని వివిధ అనుబంధ సంస్థలను వేలం వేస్తున్నారు. గడువు తేదీ మార్చి 25 నాటికి మొత్తం 54 బిడ్లు వచ్చాయి. ఆర్‌క్యాప్‌.. దాని 8 అనుబంధ సంస్థలన్నింటినీ ఏకమొత్తంగా ఒకే కంపెనీగా కొనుగోలు చేసేందుకు 22 ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ), ఆర్‌క్యాప్‌ను విడిగా.. మిగతా అనుబంధ సంస్థలను వేర్వేరుగా దక్కించుకునేందుకు మిగతా బిడ్లు వచ్చాయి. అయితే వీటిలో కొన్ని సంస్థలు లాభసాటిగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిని టర్నెరౌండ్‌ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దివాలా చట్టం ప్రకారం ఈ సంస్థలకు సంబంధించి పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్‌ భావిస్తున్నాయి. 

ఇదే అంశంపై సీవోసీ.. దాని న్యాయ సలహాదారులు, అడ్మినిస్ట్రేటరు మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో బిడ్డర్లకు పరిష్కార ప్రణాళిక అభ్యర్ధన (ఆర్‌ఎఫ్‌ఆర్‌పీ) పత్రం జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని వివరించాయి.

మరిన్ని వార్తలు