సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

6 Apr, 2021 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు ‘అడ్వాన్స్‌డ్‌ చాఫ్‌ టెక్నాలజీ’ని ’రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్‌డీవోకు చెందిన ‘డిఫెన్స్‌ లాబొరేటరీ జోధ్‌పూర్‌’(డీఎల్‌జే) ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివద్ధి చేసి షార్ట్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎస్‌ఆర్‌సీఆర్‌), మీడియం రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌సీఆర్‌), లాంగ్‌ రేంజ్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌సీఆర్‌) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. 

ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించింది. శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్‌ పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా శత్రువుల భవిష్యత్‌ దాడులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్‌డీవో సాధించింది. ఈ విజయాన్ని సాధించిన డీఆర్‌డీఓ, నౌకాదళాన్ని, డిఫెన్స్‌ ఇండస్ట్రీని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ అభినందించారు. నౌకాదళ నౌకల రక్షణ పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా.జి. సతీష్‌ రెడ్డి ప్రశంసించారు. తక్కువ వ్యవధిలో దీన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్‌డీవో చేసిన ప్రయత్నాలను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్‌ జి.అశోక్‌ కుమార్‌ కూడా అభినందించారు.

చదవండి: డిజిట‌ల్‌ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మరిన్ని వార్తలు