-

ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం

10 Sep, 2021 01:14 IST|Sakshi

ఆర్థికమంత్రిత్వశాఖ నివేదిక

జూన్‌ త్రైమాసికం వృద్ధి తీరే నిదర్శనం

సెకండ్‌వేవ్‌ కష్టాలు ఉన్నా.. ‘వీ’ తరహా రికవరీ  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ సవాళ్లు విసిరినప్పటికీ భారత్‌ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్‌ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► మూడవ వేవ్‌ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్‌ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్‌–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది.  
► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్‌ సాగు సెపె్టంబర్‌ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది.  
► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్‌ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది.  
► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్‌ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్‌ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్‌–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి.  
► ద్యుత్‌ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్‌ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్‌ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్‌టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్‌ ఇండెక్స్‌ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం.

మరిన్ని వార్తలు