ఎలాన్‌ మస్క్‌కి ఊహించని షాక్‌!

26 Nov, 2023 09:45 IST|Sakshi

అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కి ఊహించని షాక్‌ తగిలింది. మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్‌’లో అడ్వటైజ్‌ చేసుకునేందుకు డజన్ల కొద్దీ ప్రముఖ బ్రాండ్‌లు వెనక్కి తగ్గాయి. దీంతో ఎక్స్‌కు వచ్చే ప్రకటనల ఆదాయం ఏడాదికి 75 మిలియన్లు (దాదాపు రూ. 625 కోట్లు) నష్టపోవచ్చని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది .

గత వారం ఎక్స్‌లో హిట్లర్‌, నాజీ పార్టీలకు మద్దతు పలుకుతూ కొన్ని పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో సహా పలు కంపెనీలు ఎక్స్‌లో తమ అడ్వటైజ్‌లను నిలిపివేశాయి. ఈ తరుణంలో యాపిల్, ఒరాకిల్‌తో సహా ప్రధాన బ్రాండ్‌లకు సంబంధించిన ప్రకటనల పక్కన అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీకి మద్దతు తెలిపే పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. దీనిపై స్వచ్ఛం సంస్థ మీడియా మేటర్స్‌ ఎక్స్‌పై పరువు నష్టం దావా వేసింది.  

బైబై ఎక్స్‌
ఈ వారం న్యూయార్క్ టైమ్స్ నివేదికలో ఎయిర్‌బీఎన్‌బీ, అమెజాన్‌, కోకోకోలా, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు 200 కంటే ఎక్కువ యాడ్స్‌ను ఎక్స్‌లో డిస్‌ప్లే చేశాయి. అయితే వీటిలో చాలా కంపెనీలు తమ యాడ్స్‌ను నిలిపేవేసే ఆలోచనలో ఉన్నట్లు టైమ్స్‌ నివేదిక పేర్కొంది.

క్రమంగా తగ్గుతున్న ఆదాయం
ఈ శుక్రవారం ఎక్స్‌కు వచ్చే 11 మిలియన్ల (దాదాపు రూ. 92 కోట్లు) ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీలు ఎక్స్‌లో తమ ఉత్పత్తుల గురించి ప్రకటనలు చేసేందుకు మక్కువ చూపకపోవడంతో పాటు పెరిగిపోతున్న ఇతర ఖర్చులు కారణంగా ఎక్స్‌ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్‌ చేసింది. అయితే, యాడ్స్‌ తగ్గిపోవడం, ఆదాయం వంటి అంశాలపై ఎక్స్‌ యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరిన్ని వార్తలు