-

‘ఇంకా చనిపోలేదు..’ ట్వీట్‌ వైరల్‌

27 Nov, 2023 15:43 IST|Sakshi

టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ అక్టోబరు 2022లో ఎక్స్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంస్థ ఆదాయం తగ్గుతోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సోషల్‌ మీడియా సంస్థకు పోటీగా మెటా ఆధ్వర్యంలో థ్రెడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చిన తర్వాత క్రమంగా ఎక్స్‌కు వినియోగదారులు తగ్గిపోతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

దాంతోపాటు ఎలాన్‌మస్క్‌ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు కూడా కంపెనీకి వ్యతిరేకంగా మారుతున్నట్లు తెలిసింది. ఎక్స్‌ను చేజిక్కుంచుకున్న తర్వాత మస్క్‌ సుమారు 80 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాడు. అందుకు అనుగునంగా గూగుల్‌ సెర్చ్‌లో వైరల్‌గా మారిన ‘ట్విటర్‌ ఈజ్‌ డైయింగ్‌’ ట్యాగ్‌లైన్‌పై టెక్‌క్రంచ్‌, వోక్స్‌, బ్లూమ్‌బర్గ్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఎన్నో కథనాలు ప్రచురించాయి. 

అయితే తాజాగా గూగుల్‌సెర్చ్‌ల్లో ఎక్స్‌ ప్రథమస్థానంలో నిలిచింది. టాప్ 100 ఆర్గానిక్ సెర్చ్‌ల ద్వారా ట్రాఫిక్ జనరేట్‌ చేసిన ప్లాట్‌ఫారమ్‌ల్లో ఎక్స్‌ మొదటిస్థానంలో ఉందని సంస్థ తెలిపింది. ‘ఎక్స్‌ ట్రాఫిక్ అప్‌డేట్! గూగుల్‌ సెర్చ్‌ల ద్వారా కస్టమర్‌ ట్రాఫిక్‌ సంపాదించడంలో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ను భారీ తేడాతో అధిగమించాం’అని ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. అందుకు స్పందించిన మస్క్‌ ‘మేము ఇంకా చనిపోలేదని ఊహించండి’ అంటూ నవ్వతున్న ఎమోజీని షేర్‌ చేశారు. ఫేస్‌బుక్‌ 491.7 మిలియన్‌ సెర్చ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ 548.3 మిలియన్‌ సెర్చ్‌లతో పోలిస్తే ఎక్స్‌ 640.6 మిలియన్‌ సెర్చ్‌లతో టాప్‌లో నిలిచింది.

మరిన్ని వార్తలు