స్కూల్‌ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...

25 Mar, 2021 00:39 IST|Sakshi

రూ. 5 లక్షల దాకా లావాదేవీలకు ఆన్‌లైన్‌ ఈఎంఐ సదుపాయం

ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంక్‌

న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్‌లైన్‌లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్‌ అకౌంట్స్‌ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది.  ఇందు కోసం బిల్‌డెస్క్, రేజర్‌పే అనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్‌ వివరించింది.

మరిన్ని వార్తలు