24 జిల్లాలతో మొదటిస్థానంలో తమిళనాడు

13 Jul, 2021 02:56 IST|Sakshi

తప్పనిసరిగా హాల్‌ మార్కింగ్‌ అమలు...

రెండు మూడు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర

మొదటి దశలో దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో అమల్లోకి..

ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో 12 జిల్లాల చొప్పున అమలు  

న్యూఢిల్లీ: పసిడి ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్‌ అమలు జరుగుతున్న దేశంలోని మొత్తం 256 జిల్లాల్లో 24 జిల్లాలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. వరుసలో తరువాత గుజరాత్‌ (23 జిల్లాలు) మహారాష్ట్ర (22 జిల్లాలు) ఉన్నాయి.  28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాలను హాల్‌ మార్కింగ్‌కు ఎంపిక జరిగింది. జూన్‌ 16 నుంచి తొలి దశ అమలు ప్రారంభమైంది. పసిడి స్వచ్ఛతకు సంబంధించి గోల్డ్‌ హాల్‌ మార్కింగ్‌ విధానం ఇప్పటి వరకూ స్వచ్చందంగా అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి  వినియోగ మంత్రిత్వశాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

► పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల్లో 19 జిల్లాల చొప్పున హాల్‌ మార్కింగ్‌ అమలవుతోంది.
► ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో పన్నెండు చొప్పున మొత్తం 24 జిల్లాల్లో ఈ విధానం అమలు.
► కేరళ (13 జిల్లాల్లో), కర్ణాటక (14 జిల్లాల్లో), హర్యానా (15 జిల్లాల్లో) అమల్లోకి వచ్చింది.
► ఢిల్లీ, తెలంగాణాల్లో ఏడు జిల్లాల్లో అమలు.
► ఆయా జిల్లాల్లోని వర్తకులు హాల్‌మార్కింగ్‌తో 14, 18, 22 క్యారెట్ల పసిడి ఆభరణాలనే విక్రయిస్తున్నారు.  
► విజ్ఞప్తులు, విస్తృత స్థాయి సంప్రతింపుల నేపథ్యంలో కొన్ని వర్గాలను మాత్రం హాల్‌ మార్కింగ్‌ నుంచి కేంద్రం మినహాయించింది. ఉదాహరణకు రూ.40 లక్షలలోపు టర్నోవర్‌ ఉన్న వర్తకులు ఈ పరిధిలోకి రారు. ప్రభుత్వ వాణిజ్య విధానం ప్రకారం ఆభరణాల ప్రదర్శనలకు సంబంధించి ఎగుమతి, ఎగుమతులకూ ఈ నిబంధన వర్తించదు.  
► నిజానికి 2000 ఏప్రిల్‌ నుంచీ పసిడి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ స్కీమ్‌ను బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియాన్‌ స్టాండెర్డ్స్‌) అమలు చేస్తోంది. పసిడి ఆభరాల్లో దాదాపు 40 శాతానికి మాత్రమే ప్రస్తుతం హాల్‌మార్కింగ్‌ అమలు జరుగుతోంది.  
► భారత్‌లో మొత్తం నాలుగు లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉన ఉన్నారు. వీరిలో కేవలం 35,879కి మాత్రమే బీఐఎస్‌ సర్టిఫై చేసినవారు.  
► భారత్‌ దేశంలోకి సగటున 700 నుంచి 800 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది.   
► అయితే కరోనా సవాళ్ల నేపథ్యంలో మార్చితో ముగిసిన  2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి పసిడి దిగుమతులు పరిమాణంలో 2019–20తో పోల్చితే 12 శాతం పడిపోయి 633 టన్నులుగా నమోదయ్యింది. అయితే విలు వ రూపంలో చూస్తే, డిమాండ్‌ భారీగా 22.58 శాతం పెరిగింది. అంటే 2019–20తో పోల్చి 2020–21 విలువలో పసిడి దిగుమతుల విలువ 28.23 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నుంచి  34.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు 2.54 లక్షల కోట్లు)కు చేరాయి.  
► ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో బంగారం దిగుమతులు  భారీగా పెరిగి 6.91 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.51,439 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించి 79.14 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. విలువలో ఇది కేవలం 599  కోట్లు.  
► పసిడి దిగుమతులు భారీగా పెరగడం దేశ ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు పెరగడానికి దారితీయడం గమనార్హం. ఏప్రిల్,  మేలలో ఈ వాణిజ్యలోటు 9.91 బిలియన్‌ డాలర్ల (2020 ఇదే నెలలతో పోల్చి) నుంచి 21.31 బిలియన్‌ డాలర్లకు
చేరింది.  

 

మరిన్ని వార్తలు