ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్

4 Jul, 2021 19:14 IST|Sakshi

భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎందులో పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. అసంఘటిత రంగంలోని 10 కోట్ల పెద ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు కనుక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఇందులో చేరాలంటే నెల ఆదాయ రూ.15 వేలు మించకూడదు. అలాగే, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈసీఐఎస్, ఈపీఎఫ్ ఓ వంటి వాటిలో మీ పేరు ఉండకూడదు.  

18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న నెలకు రూ.15,000 కంటే తక్కువ ఆధాయం సంపాదించే కార్మికుడు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఈ పథకం ఎంచుకున్న వాళ్లు వారి వయస్సును(18 నుంచి 40) బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రతి నెల 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం తరఫున జమ అవుతుంది. ఇక మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెల రూ.3,000లను పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఒకవేల పొదుపు పథకంలో చేరిన 10 ఏళ్ల కంటే ముందే నిష్క్ర‌మిస్తే, చందాదారుడు జ‌మ‌ చేసిన మొత్తానికి వ‌డ్డీతో క‌లిపి బ్యాంకులో కలిపి వేస్తారు. ప‌దేళ్ల త‌ర్వాత, 60 ఏళ్ల‌కు ముందే స్కీమ్ నుంచి వైదొలిగితే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఖాతాలో లబ్ధిదారుడి వాటాతో జమాచేస్తారు. 

పేరు న‌మోదు చేసుకోవడం ఎలా..?
అర్హ‌త ఉన్న చందాదారులు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్స్(సీఎస్‌సీ)ల‌కు వెళ్లి వివరాలు న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈ సెంట‌ర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తాయి. ఈ పెన్షన్‌ పథకంలో చేరేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జ‌న్ ధ‌న్ ఖాతా, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. దేశ‌వ్యాప్తంగా 3.13 ల‌క్ష‌ల సీఎస్‌సీ సెంట‌ర్ల‌లో న‌మోదు చేసుకునే స‌దుపాయం ఉంది.

చదవండి: ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి

మరిన్ని వార్తలు