క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ బోర్డులో చర్చ

18 Dec, 2021 10:23 IST|Sakshi

ముంబై: సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు చర్చించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ చైర్మన్‌గా ఉన్న రిజర్వ్‌బ్యాంకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల 592వ సమావేశం లక్నోలో జరిగినట్టు శుక్రవారం ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్‌ బ్యాంకు ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీ (రూపాయి), ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కొత్తగా వస్తున్న సవాళ్లు, దిద్దుబాటు చర్యలపైనా సమీక్షించింది. ఆర్‌బీఐ అర్ధ సంవత్సర నివేదిక, స్థానిక మండళ్ల నిర్వహణపై సమావేశం చర్చించింది’’ అని పేర్కొంది.

అధికారిక డిజిటల్‌ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీల నియంత్రణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తీసుకురానున్నట్టు కేంద్ర సర్కారు లోగడ ప్రకటించడం తెలిసిందే. కానీ, వచ్చే వారం ముగియనున్న ప్రస్తుత సమావేశాల్లో బిల్లును తీసుకువచ్చే అవకాశాల్లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిప్టో కరెన్సీలకు వ్యతిరేకంగా ఆర్‌బీఐ ఇప్పటికే  ఆందోళనలను వ్యక్తం చేయడం తెలిసిందే.
 

చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపినాథ్‌..!

మరిన్ని వార్తలు