మొబిక్విక్‌ సిస్టమ్స్‌, స్పైస్ మనీపై ఆర్​బీఐ భారీ జరిమానా

23 Dec, 2021 18:15 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లపై భారీ జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీ లిమిటెడ్లపై ఒక్కొక్కరికి కోటి రూపాయల జరిమానా విధించినట్లు ఆర్​బీఐ తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 26(6)లో సూచించిన నేరాలకు పాల్పడినందుకు వన్ మొబిక్విక్, స్పైస్ మనీపై జరిమానా విధించినట్లు ఆర్​బీఐ అధికారిక ప్రకటనలో వివరించింది.

పిఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 30 నిబంధనల కింద ఆర్​బీఐకి ఉన్న అధికారం మేరకు జరిమానాలు విధించనట్లు తెలిపింది. భారత్ బిల్లు చెల్లింపు ఆపరేటింగ్ యూనిట్స్ (బీబీపీఒయులు) నికర విలువ ఆవశ్యకతపై జారీ చేసిన ఆదేశాలను ఈ రెండు సంస్థలు పాటించలేదని, ఆ తర్వాత నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది. విచారణ సమయంలో రాతపూర్వక సమాధానాలను, వ్యక్తిగత విచారణ సమయంలో ఇచ్చిన మౌఖిక సమర్పణలను సమీక్షించింది. ఆ తర్వాత ఆర్​బీఐ ఆదేశాలను పాటించలేదని అభియోగాలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు పేర్కొంది. 

(చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్..!)

>
మరిన్ని వార్తలు