93 శాతం 2,000 నోట్లు వెనక్కు వచ్చేశాయ్‌: ఆర్‌బీఐ

2 Sep, 2023 04:27 IST|Sakshi

ముంబై: ఉపసంహరణ నిర్ణయం వెలువడిన మే 19వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన ఒకటి పేర్కొంది. ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం, ఆగస్టు 31వ తేదీ నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.0.24 లక్షల కోట్లకు పడిపోయింది. బ్యాంకులకు తిరిగి వచి్చన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో జరగ్గా, 13 శాతం బ్యాంకుల్లో ఇతర కరెన్సీలోకి మారి్పడి ద్వారా వెనక్కువచ్చాయి.

అధిక విలువ నోట్లు కలిగి ఉన్న ప్రజలు 2023 సెప్టెంబరు 30 నాటికి ఆ నోట్లను డిపాజిట్‌ చేయాలని లేదా నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. 2016 నవంబర్లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్‌బీఐ, మే 19వ తేదీన ఒక కీలక ప్రకటన చేస్తూ,  రూ.2,000 నోట్లను కూడా సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

నిజానికి 2018–19లోనే ఆర్‌బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8% మాత్రమే. వ్యవ స్థలో 2,000 నోట్ల వినియోగం ఇంధనం, బంగారు ఆభరణాలు, కిరాణా కొనుగోళ్లకు అధికంగా వినియోగిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు