గిడ్డంగివారి పల్లిలో రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

20 Jan, 2022 12:50 IST|Sakshi

రిలయన్స్ జియో తన 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారి పల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సెల్ టవర్ ను కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జియో అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేంపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన గిడ్డంగివారి పల్లి చుట్టూ కొండలు ఉండటంతో ప్రజలు సరైన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్వర్క్ లేక ఇబ్బందులు పడ్డారు. 

ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలను పొందడంలో ప్రజలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడప ఎంపీ చొరవ చూపి సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేశారు. ఎంపీ సూచన మేరకు జియో త్వరితగతిన సెల్ టవర్ పనులు పూర్తి చేసి గ్రామంలో హై స్పీడ్ 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేసింది. కొత్త సెల్ టవర్ ద్వారా జియో ఇప్పుడు గ్రామ ప్రజలకు హై-స్పీడ్ 4జీ సేవలు అందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు కూడా ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా వారి విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది.

కోవిడ్ మహమ్మారి సామాన్యులు సంభాషించే విధానాన్ని మార్చింది. ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, నేర్చుకోవడం, వినోదం పొందడం మరియు ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది. గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆలా కాకుండా టెలికాం కంపెనీలు ఇప్పుడు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి  తెస్తున్నాయి. దేశంతో పాటు మన రాష్ట్రం లో కూడా అతి పెద్ద 4జీ సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్వర్క్ మరియు అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందగలుగుతున్నారు.

(చదవండి: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం ఆ రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ..!)

మరిన్ని వార్తలు