Revolt: ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్‌ గుడ్‌న్యూస్‌...!

28 Jul, 2021 20:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్‌ బైక్ల తయారీదారు రివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. తక్కువ ధరలో ఆర్‌వీ1 అనే కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా ఈ బైక్‌ ధర ప్రస్తుతం ఉన్న ఆర్‌వీ300 కన్నా తక్కువ ధరలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి ఆర్‌వీ1 ఉత్పత్తిలోకి వస్తుందని రట్టన్‌ ఇండియా ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈఎల్‌) ప్రమోటర్‌ అంజలి రట్టన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గుర్గావ్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఆర్‌వీ400,  ఆర్‌వీ300 అనే రెండు ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. రివోల్ట్ మోటార్‌లో సుమారు 43 శాతం వాటాను 150 కోట్ల రూపాయలతో రట్టన్‌ ఇండియా ఎంటర్‌ ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి ఐదు లక్షల బైక్‌లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్‌-2 తాజా సవరణల్లో భాగంగా రివోల్ట్‌ బైక్‌ ధరలు గణనీయంగా తగ్గాయి.

రివోల్ట్‌ ఆర్‌వీ 400 ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 90, 799గా ఉంది, అయితే రివోల్ట్‌ నుంచి వచ్చే కొత్త ఆర్‌వీ1 మోడల్ ధర రూ. 75 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండొచ్చునని తెలుస్తోంది. తాజాగా రివోల్ట్‌ కంపెనీ డోమినోస్‌ పిజ్జాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్ది రోజుల క్రితం రివోల్ట్‌ ఉంచిన ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోయిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు