అమెరికా స్థాయిలో దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం!: గడ్కరీ

12 Feb, 2023 19:16 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 2024 చివరి నాటికి దేశంలోని రోడ్డు మౌలిక సదుపాయాలను అమెరికా స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో హైవే మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా కొత్త ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించినట్లు తెలిపారు. 

స్వావ‌లంబన తోకూడిన భార‌త‌దేశంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 చివరి నాటికి మోదీ సారధ్యంలో అమెరికాతో సమానంగా దేశ రహదారి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము’అని కేంద్ర మంత్రి చెప్పారు.

సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని అన్నారు. పైన పేర్కొన్నట్లుగా మూడు రంగాల్లో వెనుకబడిన 500 బ్లాకులను గుర్తించినట్లు చెప్పిన గడ్కరీ..ఈ రహదారి మార్గం వెనుకబడిన ప్రాంతాల గుండా వెళుతోందని.. తద్వారా ఈ ఏరియాలకు హైవే ఒక గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ నడిచేందుకు వీలుగా  జైపూర్ - ఢిల్లీ మధ్య ఎలక్ట్రిక్ కేబుల్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.   

కాగా,ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశలో భాగంగా ఢిల్లీ - దౌసా- లాల్‌సోట్‌ల మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 247 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును రూ.10,400 కోట్ల ఖర్చుతో నిర్మించారు.

మరిన్ని వార్తలు