వివాహితపై లైంగిక దాడికి యత్నం.. అడ్డగించడంతో పెట్రోల్‌తో దాడి

9 Jan, 2022 12:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రకాశం: ఇంట్లో ఉన్న వివాహితపై యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుడ్లూరు మండలం మోచర్లలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కలగాని సుమతి(37) భర్తతో విభేదాలు రావడంతో కొంత కాలంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి మోచర్లలో తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. గతేడాది సుమతి తన కుమార్తెకు వివాహం కూడా చేసింది.

చదవండి: అడుగులో అడుగై.. అమ్మలా తానై

కొంత కాలం నుంచి గ్రామానికి చెందిన జాజుల రాజా అనే యువకుడు సుమతి వెంటపడుతూ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సుమతి రాజాను గట్టిగా మందలించింది. కక్ష పెంచుకున్న రాజా పెట్రోల్‌ బాటిల్‌తో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సుమతి వద్దకు వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.  ఆమె ఎదురు తిరగడంతో తాను వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై పోసి తగలబెట్టి వెళ్లిపోయాడు. సుమతి కేకలు వేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేసి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి తీవ్ర గాయాలైన సుమతిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు తీసుకెళ్లారు. రాజాకు కూడా స్వల్ప గాయాలు కావడంతో బంధువులు ఒంగోలు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రురాలి ఇంటిని పరిశీలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ శ్రీరామ్, ఎస్‌ఐ మల్లికార్జున ఉన్నారు. భర్తను వదిలివచ్చిన సుమతికి, భార్యను వదిలేసిన రాజాకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు