ఆర్‌ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం 

2 Oct, 2021 09:23 IST|Sakshi

ఆర్‌ఎంపీ సహాయకుడి నిర్వాకం 

కేసు నమోదు చేసిన పోలీసులు 

సాక్షి, పుట్టపర్తి: కొత్తచెరువు పట్టణంలోని షిర్డిసాయి క్లినిక్‌లో శుక్రవారం దారుణం జరిగింది. జ్వరానికి చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై ఆర్‌ఎంపీ సహాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..  షిర్డిసాయి క్లినిక్‌ను ఆర్‌ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్నాడు. కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో శుక్రవారం తల్లిదండ్రులు క్లినిక్‌కు తీసుకొచ్చారు.

ఆర్‌ఎంపీ ఆదినారాయణకు చూపించారు. అతను పరీక్షించిన తర్వాత ఇంజక్షన్‌ వేయాలని సహాయకుడు జయరామ్‌కు సూచించాడు. జయరామ్‌ బాలికను ఇంజక్షన్‌ గదిలోకి తీసుకెళ్లాడు. తల్లిని గది బయటకు పంపించాడు. తర్వాత దుస్తులు తొలగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడు జయరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పుట్టపర్తి రూరల్‌ సీఐ నరసింహారావు, కొత్తచెరువు ఎస్‌ఐ లింగన్న తెలిపారు.  

చదవండి: (విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి)

ఆగడాలకు అడ్డేదీ? 
షిర్డిసాయి క్లినిక్‌లో గతంలోనూ ఆగడాలు జరిగాయి.  అధిక డోస్‌ మందులు ఇవ్వడంతో గతంలో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌ఎంపీ సహాయకులు ముగ్గురు ఉండగా.. ఏ ఒక్కరికీ తగిన అర్హతలు లేవు. క్లినిక్‌లో ఏం జరిగినా డబ్బుతో మేనేజ్‌ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. 

ఘటన జరిగిన షిర్డిసాయి క్లినిక్‌  

మరిన్ని వార్తలు