14 ఏళ్లు.. వంద చోరీలు.. పోలీసులకు తలనొప్పిగా మారాడు.. చివరికి..

18 Dec, 2021 21:27 IST|Sakshi

సాక్షి,కావలి: రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై నగరాల్లో నూరు దొంగతనాలు చేసిన ఓ అంతర్రాష్ట్ర దొంగను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన బోలా నాగసాయి 2007 నుంచి దొంగతనాలే వృత్తిగా మార్చుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి ఒంటరిగా దొంగతనాలు చేయడం ఇతని నైజం.

2008 నుంచి ఇప్పటి వరకు వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు హైద్రాబాద్, చెన్నై నగరాల్లో వంద దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లడం, తిరిగొచ్చిన తరువాత మళ్లీ చోరీలబాట పట్టడంతో పోలీసులకు తలనొప్పిగా తయారయ్యాడు. నెల్లూరును షెల్టర్‌జోన్‌గా మార్చుకుని 20కి పైగా చోరీలు చేయడంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు.శుక్రవారం వేకువజామున ముసునూరు సమీపంలోని పమిడి కళాశాల ప్రాంతంలో బోలా నాగసాయి సంచరిస్తున్నట్లు గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.పది లక్షలు విలువైన 212 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30వేల విలువైన 315 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: భార్యాభర్తలు వాట్సాప్‌ చాటింగ్‌.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్‌..

మరిన్ని వార్తలు