పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం!

3 Mar, 2021 09:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల అదుపులో నిందితులు 

రామగుండం క్రైం: ఓ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి యత్నించిన ఘటన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బాలిక(16) తనకు పరిచయం ఉన్న యువకుడితో సోమవారం సాయంత్రం టూ ఇంక్లైన్‌ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది.

స్థానిక యువకులు కొందరు గమనించి, గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాహనం రావడం గమనించిన నిందితులు యువతిని వదిలిపెట్టి పరారయ్యారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌గౌడ్, క్రైం పార్టీ బృందం సభ్యులు బాధితురాలిని ఠాణాకు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకొని, ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ

సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ వన్‌ టౌన్‌ సీఐలు, బాధిత బాలికతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐలతోపాటు ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై శారద, క్రైమ్‌ పార్టీ బృందం సభ్యులు నిజాంపేట్‌ శేఖర్, ఏలియా, రహీంలను ఏసీపీ అభినందించారు.

చదవండి: ‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్‌ చేస్తాం    

మరిన్ని వార్తలు