సినీ ఫక్కీలో హైటెక్‌ దోపిడీ

23 Dec, 2020 08:47 IST|Sakshi
బాధితుల నుంచి డబ్బు తీసుకుని ఉడాయించిన వ్యక్తి (సీసీ కెమెరా పుటేజీ)

లోన్‌ ఇప్పిస్తానంటూ రూ.2.5 లక్షల అపహరణ

సాక్షి, రేపల్లె: లోను ఇప్పిస్తానంటూ... సినీ పక్కీలో వ్యాపారిని ఓ దుండగుడు బురిడీ కొట్టించి దోపిడీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో వెలుగు చూసింది. సీఐ సాంబశివరావు కథనం ప్రకారం.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామంలోని లక్ష్మీ కిరాణా మర్చంట్స్‌ యజమాని బొలిశెట్టి నారాయణను సోమవారం కలిశాడు. తన పేరు సుబ్బారావు అని, తాను రేపల్లె పట్టణంలోని కెనరా బ్యాంక్‌లోని ఉద్యోగినని, మీకు ముద్రాలోన్‌ పథకం ద్వారా బ్యాంక్‌ నుంచి రూ.10 లక్షల రుణం ఇప్పిస్తాంటూ నమ్మబలికాడు. రేపల్లె కెనరా బ్యాంక్‌ వద్దకు సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించాడు. దీంతో నారాయణ, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ మంగళవారం సర్టిఫికెట్లు తీసుకుని కెనరా బ్యాంక్‌కు వచ్చారు.

సుబ్బారావు వీరి కోసం బ్యాంక్‌ వద్ద వేచి ఉండి వీరు రాగానే ముందుగా బ్యాంక్‌లో అకౌంట్‌ ప్రారంభించి రూ.2.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని వారి నుంచి సొమ్ము తీసుకుని బ్యాంక్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లాడు. మీ వద్ద ఒక సర్టిఫికెట్‌ లేదు, దీని జిరాక్స్‌ తీసుకు రమ్మని నారాయణను బ్యాంక్‌ నుంచి బయటకు పంపాడు. నారాయణ జిరాక్స్‌ కాఫీ తీయించుకుని బ్యాంక్‌ వద్దకు వచ్చే సమయానికి ఆ వ్యక్తి (సుబ్బారావు) కనిపించకపోవటంతో బ్యాంక్‌ సిబ్బందితో సంప్రదించి తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరా పుటేజ్‌లు పరిశీలించామన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు