జైపూర్ : ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న కూతుర్ని హత్య చేసిన ఘటన రాజస్తాన్లోని జైపూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైపూర్ జిల్లాకు చెందిన సుమిత్ అహిర్, టీనా భార్యా భర్తలు. గత డిసెంబర్ నెలలో సుమిత్ భార్య టీనా, నాలుగేళ్ల కూతురు కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. గత శుక్రవారం ఆమె జైపూర్ రూరల్లోని ఊదావాలా గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రియుడు ప్రహ్లాద్ సహాయ్తో సహజీవనం చేస్తోన్న టీనా దగ్గరకు పోలీసులు వెళ్లారు. కూతురు గురించి ఆరా తీశారు. పాప తాత గారి ఇంటి వద్ద ఉందని ఆమె అబద్ధం చెప్పింది.
పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. టీనాను గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిపోయి అసలు విషయం బయటపెట్టింది. డిసెంబర్ 8, 2020లో టీనా కూతురు ఆడుకుంటూ మెట్ల మీద నుంచి కిందపడిపోయి, తీవ్రగాయాలపాలైంది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, పాప పరిస్థితి బాగాలేదని జైపూర్ సిటీకి వెళ్లమని చెప్పారు వైద్యులు. అయితే, సహాయ్ పాప వైద్యానికి అయ్యే ఖర్చును భరించడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలో తల్లి టీనా, ఆమె ప్రియుడు ప్రహ్లాద్ సహాయ్ పాపను చంపి అక్కడికి దగ్గరలోని అడవిలో పరేశారు.