ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై!

9 Sep, 2021 08:26 IST|Sakshi

సింగరాయకొండ: ప్రియుడిపై మోజుతో భర్తపై హత్యాయత్నానికి ప్రయత్నించి చివరకు ఆమె తన ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది. ఈ సంఘటన మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ దేవలం పల్లెపాలెంలో బుధవారం జరిగింది. ఫిర్యాదు అందిన 3.30 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపారు. కథనం ప్రకారం..దేవలం పల్లెపాలేనికి చెందిన కొక్కిలిగడ్డ సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలిసి బేల్దారి పని కోసం హైదరాబాద్‌ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు.

వీరికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. గృహిణిగా ఇంటి వద్దే ఉంటున్న వెంకటేశ్వరమ్మకు కారు డ్రైవర్‌ గంటా సతీష్‌తో పరిచయమైంది. నిజామాబాద్‌కు చెందిన సతీష్‌ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండు నెలల క్రితం సుబ్బారావు తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చాడు. ప్రియుడిపై ఉన్న మోజుతో అతడిని మంగళవారం తన ఇంటికి పిలిపించుకుంది.

భర్తకు తెలియకుండా అతడిని ఇంట్లో దాచి పెట్టింది. రాత్రి వేళ రోజూ మద్యం తాగి వచ్చే భర్తపై వెంకటేశ్వరమ్మ రుసరుసలాడుతోంది. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ఎదురేగి మరీ మద్యం ఫుల్‌ బాటిల్‌ ఇచ్చి తాగమని ఒత్తిడి చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి తర్వాత తాగుతానని చెప్పాడు. ఆదమరిచి ఉన్న భర్త మెడకు చీరచుట్టి ఇద్దరూ ఉరేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భర్త సుబ్బారావు బలవంతంగా తప్పించుకోవడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. సముద్రం వద్ద ఉన్న బోట్లలో తలదాచుకుని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు. వెంకటేశ్వరమ్మను ఆయన అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక సహకారంతో ప్రియుడు సతీష్‌ ఫోన్‌ను ట్రాప్‌ చేసి అతను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పారిపోతున్నాడని తెలుసుకున్నారు. చీరాల రైల్వేస్టేషన్‌లో నిందితుడు సతీష్‌ను కూడా అదుపులోకి తీసుకుని సింగరాయకొండకు తరలించారు. భార్య, ప్రియుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ఫిర్యాదు ఇచ్చిన 3.30 గంటల్లోనే కేసును ఛేదించామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఎస్‌ఐను సీఐ లక్ష్మణ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

చదవండి:  మచ్చా అన్నందుకు డబుల్‌ మర్డర్‌ 

మరిన్ని వార్తలు