ప్రాణాలు తీసిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ..

10 Oct, 2020 14:29 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ప్రియురాలి వ్యవహారంలో ఇద్దరి స్నేహితుల మధ్య రగిలిన చిచ్చు.. చివరకు స్నేహితుడి ప్రాణాలను బలిగొంది. కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇవ్వడంతో ఆ స్నేహితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్‌ స్నేహితులు. ప్రేమ్‌చంద్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్‌ లేకపోవడంతో స్నేహితుడైన గోపీ ఫోన్ ‌ద్వారా తరచుగా మాట్లాడేవాడు. అయితే మిత్రుడికి తెలియకుండా అదే నంబర్‌కు గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయాన్ని ప్రేమ్‌చంద్‌ గ్రహించాడు. దీంతో స్నేహితుల మధ్య పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరూ ఈ విషయమై గొడవ పడ్డారు. ప్రియురాలి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను కడతేర్చాలని ప్రేమ్‌చంద్‌ నిశ్చయించుకున్నాడు. (చదవండి: డేటింగ్‌ పేరుతో చీటింగ్‌)

అదే రోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల మార్గంలోని చప్టా వద్దకు పిలిపించి ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను అతనితో తాగించి తర్వాత నిజం చెప్పాడు. వెంటనే గోపీ బైక్‌పై ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో ఈ నెల 7న గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు