అమానుషం: బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చి.. వీడియో తీసి వైరల్‌

2 Nov, 2022 10:29 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: హైదరాబాద్‌ శివారులో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి వీడియోను వైరల్‌ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. 

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్‌ ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చాడు. కాగా కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న తోటి యువకులు బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ ఆ తతంగాన్ని వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. సదరు బాలుడి సెల్‌ఫోన్‌ లాక్కుని బెదిరించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో విషయం కుటుంబీకులకు చేరింది. 

ఆ తర్వాత వారు బాలుడికి ఫోన్‌ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. బాలుడు అది నిజం అని తెలపడంతో బాధితుడి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆ కేసును మంగళవారం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.  
చదవండి: Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో 

మరిన్ని వార్తలు