జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం

8 Sep, 2023 16:19 IST|Sakshi

దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే  జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్‌ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే..

రాయిమతి ఘివురియా
కోరాపుట్‌ జిల్లాలోని కుంద్ర బ్లాక్‌కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు.  ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‌లోని ఎంఎస్‌ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ  తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు.

ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్‌ స్కూల్ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి

మరో మహిళా రైతు సుబాస మెహనత
మయూర్‌భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్‌  మిషన్‌ తీసుకొచ్చింది.

చాలమంది మిల్లెట్‌ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు.  ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్‌ మిషన్‌ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె  ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది.

అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు.

(చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్‌’ఫుల్‌గా కరువుకు చెక్‌!)

మరిన్ని వార్తలు