ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!

27 Aug, 2023 10:18 IST|Sakshi

పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్‌ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్‌ బర్గ్‌. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్‌ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్‌ చెప్పడంతో, ఆ యజమాని అలెన్‌ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు.

అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్‌కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్‌ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్‌కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది.  

(చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..)

మరిన్ని వార్తలు