సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్‌.. ప్లాన్‌ బెడిసికొట్టింది! | Sakshi
Sakshi News home page

సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్‌.. ప్లాన్‌ బెడిసికొట్టింది!

Published Sun, Aug 27 2023 10:33 AM

Pawan Kalyan Political Plan Failed In Visakhapatanam Tour - Sakshi

అప్పుడప్పుడు లారీ మీద టూర్ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ విశాఖలో శబ్ద కాలుష్యం సృష్టించారు. ఎనిమిది రోజుల పాటు విశాఖ జిల్లా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం మీద, వైఎస్సార్‌సీపీ నేతల మీద అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఒక్కదాని మీద కూడా  నిర్ధిష్టమైన ఆధారాలు చూపలేదు. చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారం లారీ మీద ఊగిపోతూ ఉపన్యాసాలిచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన చేసిన విమర్శలేంటి..

వారాహి పేరు పెట్టిన లారీలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎనిమిది రోజుల పాటు పర్యటించారు. పలు ప్రాంతాలను సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన, వైఎస్సార్‌సీపీ నేతలపైనా అడ్డగోలు ఆరోపణలు గుప్పించారు. తన ఆరోపణల్లో ఒక్క దానికి కూడా ఒక్క ఆధారం చూపించలేక నవ్వులు పాలయ్యారు.

షాకిచ్చిన రైతులు..
విసన్నపేటలో 600 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన అనుచరులు ఆక్రమించారని ఆరోపించారు. అయితే, పవన్ విస్సన్నపేట వెళ్ళినపుడు ఒక్క రైతు కూడా ఈ విషయమై పవన్‌కు ఫిర్యాదు చేయలేదు. అసలు పవన్‌ను కలవడానికి కూడా రైతులు ఇష్టపడలేదు. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు ఈ భూములు ప్రభుత్వ, అసైన్డ్ భూములు కాదని మీడియాకు రైతులు వివరించారు. తమ భూములు ప్రభుత్వ, అసైన్డ్ భూముల నిరూపిస్తే భూములు మొత్తం పవన్‌కు రాసేస్తామని సవాల్ చేశారు.

అప్పుడేం చేశావ్‌ పవన్‌..
పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో వరలక్ష్మి అనే వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడంటూ.. కుటుంబానికి పరామర్శ పేరుతో పవన్ శవ రాజకీయానికి తెర లేపారు. అయితే, వాలంటీర్‌ వెంకటేష్‌ పనితీరు సరిగాలేక అప్పటికే అతన్ని విధుల నుంచి అధికారులు తొలగించారు. అసలు వెంకటేష్‌ను వాలంటీర్‌గా తీసేసిన సంగతి తెలియక పనిలో తాము పెట్టుకున్నామని వరలక్ష్మి కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. ఇక రుషికొండ పర్యటన అంటూ పవన్ హడావిడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. కోర్టులు కూడా ఎక్కడా రుషికొండ నిర్మాణాలను తప్పు పట్టలేదు. రుషికొండపై నిర్మాణాలు కొత్తగా కడుతున్నవి ఏమీ కాదు. గతంలో నిర్మించిన పాత నిర్మాణాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి పవన్ ఇక్కడ పర్యటించారు. అప్పటికి ఇప్పటికీ రుషికొండ నిర్మాణాల్లో ఏం మార్పు వచ్చిందో పవన్‌కే తెలియాలి.

ఆధారాలెక్కడ..
ఎర్ర మట్టి దిబ్బలకు, రైతుల భూములకు తేడా తెలియకుండా వాటి గురించి కనీస అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడి విమర్శలపాలయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రైతుల నుంచి వీఎంఆర్డీఏ భూములు తీసుకొని ప్లాట్లుగా అభివృద్ధి చేసింది. ఆ భూముల్లోకి వెళ్లి వాస్తవాలను దాచిపెట్టి ప్రకృతి సంపదను దోచేస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. జనవాణి కార్యక్రమం జరిగిన తీరు గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎంపిక చేసుకొన్న కొంతమంది జనసేన కార్యకర్తలను జనవాణి కార్యక్రమానికి తీసుకువచ్చారు. వారితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారు. పవన్ నిర్వహించిన రెండు బహిరంగ సభల్లో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివి వినిపించారు. రోజూ చంద్రబాబు చేసే విమర్శలనే పవన్ ప్రభుత్వంపై చేశారు. అయితే, ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేకపోయారు. మొత్తం మీద వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అక్కసు తీర్చుకోవడానికే పవన్ విశాఖ వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: పోలవరంపై బాబువి కాకి లెక్కలు

Advertisement
Advertisement