ఉజ్వల భవిత వైపు దిశానిర్దేశం

30 Nov, 2023 00:38 IST|Sakshi

సందర్భం

భారత్‌ జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించే నాటికి ప్రపంచం అనేక సమస్యలనెదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని భారత్‌ నేతృత్వంలోని జీ20 నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు.

భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటితో 365 రోజులు పూర్తయ్యాయి. ‘వసుధైవ కుటుంబకం’...అంటే– ‘ఒకే భూమి–ఒకే కుటుంబం–ఒకే భవి ష్యత్తు’ స్ఫూర్తిని చాటేలా పునరంకితమవుతూ... పునరుజ్జీవనానికి బీజం వేసిన క్షణమది.మనం నిరుడు ఈ బాధ్యత స్వీకరించే నాటికి యావత్‌ ప్రపంచం బహుముఖ సవాళ్లతో సతమతం అవుతోంది. బహుళ దేశాలు పాల్గొనే విధానం (మల్టీ లేటరలిజం) క్షీణించే తరుణంలో కోవిడ్‌–19 మహ మ్మారి దుష్ప్రభావం నుంచి కోలుకోవడం, నానాటికీ పెరుగుతున్న వాతావరణ మార్పు సమస్యలూ, ఆర్థిక అస్థిరత, వర్ధమాన దేశాల్లో రుణభారం తదితరాలన్నీ చోటు చేసుకున్నాయి. అలాగే ఘర్షణలూ, వివాదాలూ, స్పర్థాత్మకతల మధ్య ప్రగతి సంబంధిత సహకార భావన దెబ్బతిని, పురోగమనం కుంటుపడింది.

ఈ నేపథ్యంలో జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారత దేశం ఆనాటి  దుఃస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యా మ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రక ప్రగతి నుంచి మానవ–కేంద్రక పురోగమనం వైపు మళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. మన మధ్య విభజన తెస్తున్న కారణాన్ని కాకుండా మనల్ని ఏది ఏకం చేయగలదో దాని గురించి గుర్తుచేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో అంతిమంగా అంతర్జాతీయ చర్చలు పరిణామశీలమై– కొందరి స్వార్థానికి కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేయక తప్పలేదు. అయితే, ఇందుకోసం ముఖ్యంగా చేయాల్సిందల్లా బహుళ దేశాలు పాల్గొనే విధాన మూలాల నుంచి సంస్కరణలు తేవడం.

‘సార్వజనీనత, ఆకాంక్షాత్మకత, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మ కత’ అనే నాలుగు పదాలు జీ20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో మన విధానమేమిటో సుస్పష్టంగా నిర్వచించాయి. అటుపైన జీ20 సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం’ (ఎన్డీఎల్డీ) ఈ సూత్రాల అమలులో మన నిబద్ధతను ప్రస్ఫుటం చేసింది. సార్వజనీనత అన్నది మన అధ్యక్ష పదవికి ఆత్మ వంటిది. దీనికి అనుగుణంగా ఆఫ్రికా సమాఖ్య (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా 55 ఆఫ్రికా దేశాలను ఈ వేదిక మీదకు చేర్చాం. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా జీ20 విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు –అవకాశాలపై  మరింత సమగ్ర చర్చలను ఈ క్రియాశీల వైఖరి ప్రోత్సహించింది.

ఇక ‘దక్షిణార్ధ గోళ దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు మల్టీలేటరలిజం నవోదయానికి శుభారంభం పలికింది. ఆ విధంగా దక్షిణార్ధ గోళ దేశాల సమస్యలను భారతదేశం అంతర్జాతీయ చర్చల ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. సార్వజనీనత అన్నది భారత దేశీయ విధాన ఉత్తేజాన్ని జీ20కి వ్యాపింపజేసింది. ఆ మేరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి తగినట్లుగా జీ20కి భారత నాయకత్వం ప్రజా ధ్యక్షతగా రూపొందింది. 

కీలకమైన 2030 ఎజెండా మధ్యలో జీ20 కార్యాచరణ ప్రణాళికను  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)ను వేగవంతం చేయడంతోపాటు ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమ తౌల్యం, పరస్పర అనుసంధానిత సమస్యల పరిష్కారం కోసం విస్తృత కార్యాచరణ–ఆధారిత విధానాన్ని భారత్‌ రూపొందించింది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి జనహిత మౌలిక సదుపాయాలు (డీపీఐ) అత్యంత కీలకం.

ఆ మేరకు ‘ఆధార్, యూపీఐ, డిజీలాకర్‌’ వంటి డిజిటల్‌ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసిన భారత్‌ తనవంతుగా నిర్ణయాత్మక సిఫారసులు చేసింది. జీ20 ద్వారా మనం జనహిత మౌలిక సదుపాయాల భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. దీన్ని ప్రపంచ సాంకేతిక సహ కారంలో గణనీయ పురోగమనంగా పేర్కొనవచ్చు. ఈ భాండాగారంలో 16 దేశాల నుంచి 50కి  పైగా దేశాల ‘డీపీఐ’లున్నాయి.

మన భూగోళం కోసం తక్షణ, శాశ్వత, సమాన మార్పు సృష్టి లక్ష్యంగా ప్రతిష్ఠాత్మక, సమగ్రమైన లక్ష్యాలను అనుసరిస్తున్నాం. భూగోళ పరిరక్షణ, పేదరిక నిర్మూలన నడుమ మన ఎంపి కకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడం ఎలాగో ‘ఎన్డీఎల్డీ’ నిర్దేశిత ‘హరిత ప్రగతి ఒప్పందం’ వివరిస్తుంది. ఇక 2030 నాటికి ప్రపంచ పునరు త్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రతిష్ఠాత్మక రీతిలో మూడు రెట్లు పెంచాలని కూడా జీ20 తీర్మానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటూ, హరిత ఉదజని కోసం సమష్టి కృషీ... పరిశుభ్ర, హరిత ప్రపంచ నిర్మాణంపై జీ20 ఆదర్శాలు కాదనలేని నిజాలు. భారత్‌ అనాదిగా అనుసరిస్తున్న విలువలు ఇవే. 

ఉత్తరార్ధ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరడం ద్వారా వాతావరణ న్యాయం–సమా నత్వం విషయంలో మన నిబద్ధతను కూడా ‘ఎన్డీఎల్డీ’ నొక్కి చెప్పింది. కాగా, అభివృద్ధికి ఆర్థిక చేయూత పరిమాణంలో తొలిసారిగా ఆశించిన మేర రెట్టింపు పెరుగుదల నమోదైంది. ఆ మేరకు ఈ సాయం బిలియన్ల డాలర్ల స్థాయి నుంచి ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వర్ధమాన దేశాలు 2030 నాటికి తమ దేశీయ ప్రగతి లక్ష్యాల (ఎన్డీసీ)ను సాధించడానికి 5.9 ట్రిలియన్‌ డాలర్లు అవసరమని జీ20 అంగీకరించింది.

న్యూఢిల్లీ దేశాధినేతల తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. ఆ మేరకు ఇది వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. ‘భారత మహిళా రిజర్వేషన్‌ బిల్లు–2023’ ద్వారా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటా యించడం ద్వారా మహిళా చోదక ప్రగతిపై భారత్‌ నిబద్ధతను జీ20 ప్రతిబింబించింది. విధానపరమైన సమన్వయం, విశ్వసనీయ వాణిజ్యం, ప్రతిష్ఠాత్మక వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నిటా పరస్పర సహకార స్ఫూర్తిని ‘ఎన్డీఎల్డీ’ చాటిచెప్పింది. మన అధ్యక్షత సమయంలో జీ20 ద్వారా 87 నిర్ణ యాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వించదగిన అంశం. 

మన జీ20 అధ్యక్షత సమయంలో భౌగోళిక–రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధి–ప్రగతిపై వాటి ప్రభావం వగైరాల పైనా చర్చలకు భారత్‌ నాయకత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణ రహితంగా పౌరుల ప్రాణాలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ బెడదను నిర్మూలించడం సాధ్యమని స్పష్టం చేసింది. మనం శత్రుత్వం స్థానంలో మానవత్వాన్ని స్వీకరించాలి. ఆ మేరకు ఇది యుద్ధ యుగం కాదనే వాస్తవాన్ని పునరుద్ఘాటించాలి.

జీ20 అధ్యక్ష బాధ్యతల సమయంలో భారత్‌ అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది: ఇది మల్టీలేటరిజాన్ని పునరుజ్జీవింపజేసింది. దక్షిణార్ధ గోళ దేశాల గళాన్ని మరింతగా వినిపించింది. ప్రగతి సాధనకు ప్రాముఖ్యమిచ్చింది. అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది.ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి–శ్రేయస్సు దిశగా ఇప్పటివరకూ మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తూ జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ దేశానికి అప్పగిస్తున్నాం.     
                                            
నరేంద్ర మోదీ
భారత ప్రధాని 

మరిన్ని వార్తలు