కార్డులేని 10 లక్షల కుటుంబాల పరిస్థితేంటి?

11 Nov, 2023 06:49 IST|Sakshi

హైదరాబాద్: మళ్లీ అధికారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తెల్లరేషన్‌్‌ కార్డులకు మరింత ప్రాధాన్యం పెంచినట్లయింది. కేవలం పీడీఎస్‌ బియ్యానికే పరిమితం కాకుండా రేషన్‌ కార్డు బహుళ ప్రయోజనకారిగా తయారు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తే కార్డుదారులకు పీడీఎస్‌ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం, రైతు బీమా తరహాలో అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా హామీ అమలైతే హైదరాబాద్‌ మహానగర పరిధిలో సుమారు 21.22 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అయితే.. మరో పది లక్షల పేద కుటుంబాలకు రేషన్‌ కార్డులు లేవు. మూడేళ్లుగా దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌ లాగిన్‌ కూడా నిలిచిపోయింది. అంతకు ముందు దరఖాస్తుల్లో కేవలం 40 శాతం పెండెన్సీ మాత్రమే క్లియర్‌ అయింది. మరోవైపు కార్డులో కొత్త సభ్యుల చేర్పులు, మార్పుల దరఖాస్తులకు అవకాశం ఉన్నప్పటికీ ఆమోద ప్రక్రియ ఆరేడేళ్ల నుంచి పెండింగ్‌లో మగ్గుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.

బీమాతో ధీమాగా..
అధికార బీఆర్‌ఎస్‌ ప్రకటించిన హామీతో పేద కుటుంబాలకు బీమా ధీమాగా మారనుంది. బీమా కోసం తెల్ల రేషన్‌ (ఆహార భద్రత) కార్డు అర్హత కార్డుగా మారనుంది. అర్హత గల కుటుంబాలకు రైతు బీమా తరహాలోనే.. ఎలాంటి మరణం సంభవించిన ఎల్‌ఐసీ ద్వారానే ద్వారా రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం వర్తింపజేయనుంది. మరణం సంభవించిన పది రోజుల్లో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందనుంది. ప్రభుత్వం అర్హులైన వారి పేరిట ప్రీమియం చెల్లించి బీమా వర్తింపజేసే విధంగా ఎల్‌ఐసీ ఒప్పందం కుదుర్చుకొనున్నది. ఈ నిబంధనలు పేద కుటుంబ సభ్యులకు బీమా వర్తింపును దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా బీమా నిబంధనల ప్రకారం 60 ఏళ్లలోపు వారే అర్హులు.

కార్డులు ఇలా
మహానగరంలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లో 22 లక్షలు ఉండగా అందులో ఇతరప్రాంతాల నుంచి వచ్చి రేషన్‌ పోర్టబిలిటీతో ఇక్కడే రేషన్‌ సరుకు డ్రా చేస్తున్న కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మొత్తమ్మీద కార్డుల్లో సుమారు 66 లక్షల సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బీమా నిబంధనలు అమలైతే తెల్ల రేషన్‌న్‌కార్డుదారుల్లో 60 దాటిన వారంతా బీమాకు అనర్హులే. కార్డు హోల్డర్‌ పేరిట బీమా వర్తింపజేస్తే.. మొత్తం కార్డు దారుల్లో 20 శాతం మంది పైగా అర్హత కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆరోగ్యశ్రీ వర్తింపు..
ఇప్పటికే ఆరోగ్యశ్రీ – ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు హామీతో మరింత ఉపశమనం కలుగనుంది.

సన్నబియ్యం పంపిణీ..
బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రేషన్‌న్‌న్‌కార్డుదారులకు సన్నబియ్యం అందనుంది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నారు. కోవిడ్‌ సష్టించి ఆర్థిక సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా ఉచితంగా పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్రం వాటాకు అదనంగా రాష్ట్రం వాటా కలిపి పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ప్రతి కార్డులోని యూనిట్‌కు ఆరుకిలోల చొప్పున కోటా ఉండగా కోవిడ్‌ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కోటాను పెంచారు.

మరిన్ని వార్తలు