పాక్‌లోనూ పోలీసులంతే.. బర్గర్లు ఉచితంగా ఇవ్వనందుకు

11 Jul, 2021 11:23 IST|Sakshi

అడిగింది ఇవ్వకున్నా, చెప్పింది చెయ్యకున్నా ఏదో కేసు బనాయించి అరెస్ట్‌ చేసే కేడీ పోలీసుల్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అయితే కేవలం బర్గర్లు ఫ్రీగా ఇవ్వనందుకు ఏకంగా రెస్టారెంట్‌ని మూయించి, 19 మంది సిబ్బందిని అరెస్ట్‌ చేశారు పాకిస్తాన్‌లో కొందరు పోలీసులు. ‘జానీ అండ్‌ జుగ్నూ’ అనే రెస్టారెంట్‌లో బర్గర్లు ఆర్డర్‌ చేసి, ఉచితంగా ఇవ్వాలని పట్టుబట్టారు పోలీసులు. దానికి నిరాకరించినందుకు.. అక్కడ పనిచేసే సిబ్బందిని అరెస్ట్‌ చేసి.. సుమారు ఏడు గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్బంధించారు. అరెస్ట్‌ అయినవారిలో కిచెన్‌ సిబ్బంది కూడా ఉండటంతో ఆ హోటల్‌ను మూసివేయాల్సి వచ్చింది.

ఆ రెస్టారెంట్‌ యజమాని  ‘పోలీసులు మా రెస్టారెంట్‌ వర్కర్స్‌ని ఇబ్బంది పెట్టడం ఇదేం తొలిసారి కాదు. ఇలాంటి ఘటనలకు ఇదే చివరి రోజు కావాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు. పైగా అరెస్ట్‌ అయిన సిబ్బంది అంతా వివిధ యూనివర్సిటీల్లో చదువుతూ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న యువతే. దాంతో ఆ ట్వీట్‌  వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకుని అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. అందుకు కారణమైన పోలీసులను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. సీనియర్‌ ప్రావిన్షియల్‌  అధికారి ఇనామ్‌ ఘనీ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు..‘ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదు. అలాంటి వారిని క్షమించేది లేదు’ అంటూ!

మరిన్ని వార్తలు