రష్యా నుంచే ర్యాన్సమ్‌వేర్‌ దాడులు

11 Jul, 2021 01:53 IST|Sakshi

పుతిన్‌కు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో స్పష్టీకరణ 

వాషింగ్టన్‌: రష్యాకు చెందిన కొందరు నేరగాళ్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫోన్‌ చేసి సైబర్‌ దాడులతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ర్యాన్సమ్‌వేర్‌ దాడుల కారణంగా అమెరికాతోపాటు ఇతర దేశాల సంస్థలకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. రష్యా భూభాగం నుంచి ఈ దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

రష్యా నుంచి ఏదైనా ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగినప్పుడు, ఆ దాడికి ప్రభుత్వం కారణం కానప్పటికీ, బాధ్యులను గుర్తించి తగు సమాచారం తాము అందజేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను బైడెన్‌ ఈ సందర్భంగా కోరారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట పడనట్లయితే, తమ ప్రజలను, వ్యవస్థలను కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా బైడెన్‌ స్పష్టం చేశారు. అదే విధంగా, ఒకరి దేశానికి నష్టం కలిగించే పరిణామం మరొకరి దేశంలో సంభవిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాల అధ్యక్షులు ఇకపై ఎప్పటికప్పుడు పంచుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైందని వైట్‌హౌస్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు