వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం

16 Apr, 2023 02:47 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు సదస్సులో మోదీ పిలుపు

వాషింగ్టన్‌: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్‌ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు.

ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్‌ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు.

మరిన్ని వార్తలు