భారత్, బంగ్లా సంయుక్తంగా.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం

2 Nov, 2023 05:53 IST|Sakshi

ఢాకా/అగర్తలా: భారత్, బంగ్లాదేశ్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్‌ హసీనాలు బుధవారం సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రిపురలోని నిశి్చంతపూర్, గంగాసాగర్‌ను బంగ్లాదేశ్‌తో కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా–మోంగ్లా పోర్ట్‌ రైల్వే లైన్, బంగ్లాలోని రామ్‌పూర్‌లో ఉన్న మైత్రీ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులను నేతలు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అగర్తలా నుంచి బంగ్లాలోని అఖౌరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరుదేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు.

రైలులో అగర్తలా నుంచి ఢాకా మీదుగా కోల్‌కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ‘ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తలా–అఖౌరా క్రాస్‌బోర్డర్‌ రైల్వేలింక్‌ను ప్రారంభించడం చరిత్రాత్మకం’ అని ప్రారం¿ోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. 12.24 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు 5.46 కి.మీ.లు త్రిపురలో మిగతా 6.78 కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. ‘రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్లీ కలిశాం.

గత దశాబ్దాల్లో రెండు దేశాల్లో జరగని అభివృద్ధిని ఈ 9 ఏళ్లలో సాధించాం. మన దేశాల పటిష్ట మైత్రీ బంధానికి ఈ ప్రాజెక్టులే సంకేతం’ అని హసీనాతో వీడియో కాన్ఫెరెన్స్‌ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అగర్తలా–అఖౌరా రైలు మార్గం నిర్మాణం కోసం బంగ్లాకు భారత్‌ రూ.392.52 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. కొత్త రైల్వే లైన్‌ అందుబాటులోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, అనుసంధానత ఊపందుకోనుంది. ఢాకా మీదుగా ఈ రైలు మార్గంలో అగర్తలా నుంచి కోల్‌కతాకు చాలా త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న 1,600 కిలోమీటర్ల దూరం ఏకంగా 500 కి.మీ.లకు తగ్గతోందని కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా చెప్పారు. 

మరిన్ని వార్తలు