ఆహా.. నీరు భూమ్మీద పుట్టలేదా? అంత నీరు అలా వచ్చి చేరిందా!!

16 Aug, 2022 11:07 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: ఈ భూమ్మీద నీటి శాతం 71గా ఉందని చదువుకునే ఉంటారు. ఈ నీటిలో సింహభాగం.. మహా సముద్రాలు, సముద్రాల రూపంలోనే ఉంది. మిగతా భాగం.. ఖండాలు, ద్వీపాలు వగైరా వగైరా ఉన్నాయి. మరి అంత శాతం నీరు ఎలా వచ్చి చేరి ఉంటుందని అనుకుంటున్నారు?.. ఈ విషయంపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇది తేల్చేందుకే జపాన్‌ ఓ స్పేస్‌ మిషన్‌ను చేపట్టింది. సుమారు ఆరేళ్ల తర్వాత దాని ఫలితం ఆధారంగా.. ఇప్పుడొక ఆసక్తికర ప్రకటన చేసింది. 

సౌర వ్యవస్థ యొక్క బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్‌).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయనేది జపాన్‌ స్పేస్‌ మిషన్‌ తేల్చిన విషయం. ఆశ్చర్యంగా అనిపించిన.. వాటి ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయన్నది ఈ మిషన్‌ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నది జపాన్‌ పరిశోధకులు చెప్తున్నమాట. 

ఈ భూమ్మీద జీవితం మూలాలు, విశ్వం నిర్మాణంపై వెలుగునిచ్చే అంశాల అన్వేషణలో భాగంగా.. 2020లో  రైయుగు Ryugu అనే గ్రహశకలం భూమ్మీదకు తీసుకొచ్చిన పదార్థాన్ని పరిశీలించారు. హయబుసా-2 అని పిలిచే జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించారు. భూ జీవనానికి సంబంధించిన కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించామని, అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం ఈ జూన్‌లో ఓ ఆర్టికల్‌ తమ పరిశోధన వివరాలను వెల్లడించింది. 

అంతేకాదు.. రైయుగు శాంపిల్స్‌లో కనిపించిన ఆర్గానిక్‌ మెటీరియల్‌ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉంటాయన్న వాదనకు బలం చేకూరుతోందని అంటున్నారు. అస్థిర, ఆర్గానిక్‌మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమి యొక్క నీటి యొక్క ప్రధాన వనరులలో ఒకటిగా ఉండవచ్చంటూ జపాన్‌, ఇతర దేశాల సైంటిస్టులు.. జర్నల్‌ నేచర్‌ ఆఫ్‌ ఆస్ట్రోనమీలో అభిప్రాయం వెల్లడించడం.. ఆ జర్నల్‌ సోమవారం పబ్లిష్ కావడం విశేషం.

ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్‌కు సర్‌ప్రైజ్‌

మరిన్ని వార్తలు